ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 నియామక పరీక్షకు పోటీ తీవ్రంగా ఉంటుంది. దీనికి పోటీ పడాలనుకుంటున్న అభ్యర్థులు తక్షణ కార్యాచరణ ఆరంభించాలి. గెలుపును నిర్ణయించే కీలక సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి. వాటిని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. నోట్సు రాసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చేలోగానే వీటిపై పట్టు సాధించటానికి ప్రయత్నించాలి!
ఉద్యోగార్థులు అందరితోపాటు దిగువ స్థాయి ప్రభుత్వోద్యోగులూ, సాఫ్ట్వేర్ ఉద్యోగుల దృష్టీ ఇప్పుడు గ్రూప్-1 పోస్టుల మీదే ఉంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం గత రెండు, మూడు సంవత్సరాల నుంచి సీరియస్గా సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా తమ దృష్టిని గ్రూప్-1పై కేంద్రీకరిస్తున్నారు.
గ్రూప్-1 సర్వీస్ సాధించాలంటే నోటిఫికేషన్ గురించి ఎదురుచూడకుండా నేటి నుంచే పటిష్ఠ ప్రణాళికను రూపొందించుకుని సన్నద్ధతను ప్రారంభించాలి. వీలైనంత త్వరగా గ్రూప్-1 పరీక్షలో కీలక సబ్జెక్టులపై పట్టు సాధించాల్సి ఉంటుంది.
రెండు స్థాయుల్లో జరిగే గ్రూప్-1 పరీక్షలో మొదటిది ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్), రెండోది ప్రధాన పరీక్ష (మెయిన్స్). మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ప్రధాన పరీక్షలో ఒక భాగమని గుర్తించండి. అభ్యర్థులు ప్రధాన రాత పరీక్షలో, మౌఖిక పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు ముందు ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ను పరిశీలించి వాటిలో ఏయే అంశాలు మెయిన్ పరీక్షలో కూడా ఉన్నాయో గుర్తించాలి.
సిలబస్లో ఏయే సబ్జెక్టుల్లో మార్పులు ఉండవో గుర్తించి మొదట వాటిపై దృష్టిని కేంద్రీకరించటం మేలు. download activator avast premier 2016 వాటిని విశ్లేషణతో అధ్యయనం చేస్తూ నోట్సును స్వయంగా, సమగ్రంగా తయారు చేసుకోవాలి. అంతేకాకుండా ఇది ప్రిలిమ్స్కూ, మెయిన్స్కూ ఉపయోగపడేటట్లు ఉండాలి.
ఈవిధంగా ప్రిలిమ్స్లోని మొత్తం 150 ప్రశ్నలకు దాదాపు మూడో వంతు ప్రశ్నలు పై సబ్జెక్టుల నుంచే వస్తాయి. అంతేకాకుండా ఇండియన్ పాలిటీ నుంచి మరో 15- 18 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు జరిగితే జరగవచ్చు. ‘భారత ఆర్థిక వ్యవస్థ’కు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణల నుంచి 5- 6 ప్రశ్నలు ఉండవచ్చు.
ఈ సబ్జెక్టులు ముందుగా చదివితే ప్రిలిమ్స్లో దాదాపు సగం సిలబస్ పూర్తి చేసినట్లు అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేలోపే ఇవన్నీ సిద్ధమైతే ఎంతో ప్రయోజనం!
*ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది?*
* ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ అయినప్పటికీ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండాలి. కేవలం బిట్లు చదివితే సరిపోదు.
* ప్రిలిమ్స్లో ప్రశ్నలు లోతుగా తికమక పెట్టేట్లు ఉంటున్నాయి. ‘కిందివాటిలో ఏది సరైనది కాదు?’ అనే ప్రశ్న వచ్చిందనుకోండి.
ఇచ్చిన నాలుగు జవాబుల్లో మూడు అంశాలు మీకు తెలియాల్సిందే! అందులో ఏది తెలియకపోయినా మీ సమాధానం తప్పు అవుతుంది
*ధీమా తగ్గిపోనీయొద్దు!*
పరీక్షల ముందు ఆలోచనా విధానంలో మెల్లగా మార్పు వస్తుంటుంది. అప్పటివరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్లకు కూడా ధీమా సన్నగిల్లుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాలంటే…?
నమ్మకాన్ని పెంచుకోవడానికి చక్కని సన్నద్ధతను మించిన మార్గం లేదు. ఏ సబ్జెక్టుకు ఎంత సమయం అవసరమో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలి.
చదివిన అంశాన్ని ఒకసారి చూడకుండా రాసుకుంటే స్వీయ సమర్థతను సరిగా అంచనా వేసుకోవచ్చు. సరిగా రాయలేకపోతే మళ్లీ చదివి రాయొచ్చు. ఇలా చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* చదువుతున్న అంశంలోని ముఖ్యాంశాలను నోట్స్లో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. వీటిని పరీక్షల ముందు ఒకసారి చదువుకుంటే సమయం ఆదా అవుతుంది.
* చదివిన విషయాలను స్నేహితులతో చర్చించడం వల్ల అవి బాగా అర్థమవుతాయి. అంతేకాదు ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి కూడా.
* మీరు ఏమేం చదివారు, పరీక్షల్లో అవన్నీ వస్తాయా రావా అనే విషయాల గురించి చర్చించడం మానేయాలి. ఇప్పటివరకు సాగించిన సన్నద్ధత మీద నమ్మకం ఉంచాలి.
* పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో సానుకూల దృక్పథం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెరిగి చదివిన విషయాలను సమీక్షించుకోవడానికి ఈ దృక్పథం ఎంతో తోడ్పడుతుంది.
* తగినన్ని నీళ్లు తాగడం, పోషకాహారం తీసుకోవడం మర్చిపోకూడదు. శరీరం అలసటగా, నీరసంగా ఉండి.. ఆరోగ్యం సరిగా లేకపోతే ఏమైనా సాధించగలరనే నమ్మకం మెల్లగా తగ్గిపోతుంది.
*మొదట అవగాహన.. ఆపైనే బిట్ల సాధన!*
*జీఎస్ ప్రిపరేషన్ మెలకువలు*
జనరల్ స్టడీస్ (జీఎస్)! తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న నోటిఫికేషన్లు అన్నిటిలోనూ రాతపరీక్షల్లో ఉమ్మడిగా ఉండే సిలబస్. పరిధి దృష్ట్యా ఇది చాలా విస్తృతమైనది. ఇంత విస్తారమైన సిలబస్ చదివినా 100- 150 మార్కులకు మాత్రమే ఆబ్జెక్టివ్ పరీక్షల్లో అవకాశం ఉంటుంది. ఎలా ప్రిపేరైతే గరిష్ఠ మార్కులు తెచ్చుకోవచ్చనే విషయంలో ప్రధానంగా కొత్త అభ్యర్థులు సందిగ్ధతకు లోనవుతుంటారు. ఆయా విభాగాలపై పట్టు తెచ్చుకోలేని పరిస్థితిలో ప్రేరణ కూడా కోల్పోతూ ఉంటారు. ఫలితంగా కావలసిన స్థాయిలో పోటీ పడలేని పరిస్థితిలో చిక్కుకుంటారు! జనరల్ స్టడీస్పై పట్టు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. చేయాల్సిందల్లా వ్యూహాత్మకంగా చదవటం! అదెలాగో పరిశీలిద్దాం.
జీఎస్లో 11 / 12 విభాగాలు ఉన్నప్పటికీ అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఉండదు. ప్రధానంగా భారత భౌగోళిక అంశాలు, స్వాతంత్య్రోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అంక గణితం, రీజనింగ్ సామర్థ్యాలకు ఎక్కువ మార్కులుంటాయి. అందువల్ల అభ్యర్థులు మొదట ఈ విభాగాలపై పట్టు తెచ్చుకునేందుకు కాలపట్టిక (టైమ్ టేబుల్)ను తయారు చేసుకోవాలి.
* మిగతా విభాగాలకు ప్రశ్నల సంఖ్యలో, మార్కుల కేటాయింపులో పెద్ద ప్రాధాన్యం లేకపోయినా చాలా తక్కువ శ్రమతో ఆయా అంశాలపై పట్టు సాధించవచ్చు. మార్కులు పొందవచ్చు. పర్యావరణ అంశాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, విపత్తు నిర్వహణ, గవర్నెన్స్ మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ఈ విషయాలను సులభంగానే అర్థం చేసుకోవచ్చు. అందుకే మొత్తం కాలపట్టికలో వీటికి తక్కువ సమయాన్ని కేటాయించి వ్యూహాత్మకంగా చదవాలి.
* ఉన్నత పాఠశాల స్థాయి జ్ఞానంతో జనరల్ స్టడీస్లోని కొన్ని విభాగాలను అనుసంధానం చేసుకుని ఉన్నట్లయితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. జనరల్ సైన్స్, భారత భౌగోళిక అంశాలు, అర్థశాస్త్ర అంశాలు ఈ తరహా ప్రశ్నకు సంబంధించినవిగా గుర్తించాలి. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని సంబంధిత అంశాలపై పట్టు సాధించిన తరువాత ఇంకా అవసరమనుకుంటే గ్రాడ్యుయేషన్ స్థాయి పుస్తకాలు చదవొచ్చు.
* జనరల్ స్టడీస్లోని కొన్ని విభాగాలను డిగ్రీ స్థాయిలోనే చదవాల్సి ఉంటుంది. ప్రధానంగా తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాలు గానీ, విశ్వవిద్యాలయాల డిగ్రీ పుస్తకాలు గానీ చదవొచ్చు. భారత రాజ్యాంగ వ్యవస్థ, పర్యావరణ అంశాలు, అర్థ శాస్త్రంలోని కొన్ని టాపిక్స్, భారత స్వాతంత్య్రోద్యమం, ప్రాచీన భారతదేశ చరిత్ర, శాస్త్ర సాంకేతిక అంశాలు… మొదలైనవి డిగ్రీ స్థాయిలో చదవాల్సి ఉంటుంది.
* రీజనింగ్, డేటా ఇంటర్ప్రెటేషన్ ప్రశ్నలస్థాయి పరీక్ష స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. దిగువ స్థాయి ఉద్యోగాల పరీక్షల్లో సాధారణ స్థాయి ప్రశ్నలుంటాయి. ఒక ప్రత్యేక సబ్జెక్టుకు సంబంధం ఉన్న పరీక్షలోని జనరల్ స్టడీస్లో కూడా రీజనింగ్ ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి.. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో సాధారణ స్థాయిలో కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ ఎక్కువ సందర్భాల్లో క్లిష్టత స్థాయి ఎక్కువ ఉన్న ప్రశ్నలు అడిగారు. అందువల్ల ఈ విభాగాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదటి నుంచి కొద్దిగా కఠినత్వం ఎక్కువగా ఉన్న ప్రశ్నలు సాధించేలా చూసుకోవాలి.
* జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఆధారం చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక అర్ధ గంట సమయాన్ని కేటాయిస్తూ వివిధ జాతీయ, అంతర్జాతీయ విషయాలపై దృష్టి పెట్టాలి. బిట్ల రూపంలో ఈ సబ్జెక్టును చదవకూడదు. విస్తృత అవగాహనతో చదివాక బిట్ల రూపంలో సాధన చేస్తే ఎక్కువ ఉపయోగం. పరీక్ష సమయానికి కనీసం నాలుగు నెలల ముందు జరిగిన వివిధ వ్యవహారాలను ప్రశ్నల రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో జరిగిన వివిధ విషయాలపె ఎక్కువ దృష్టి పెట్టాలి. పరీక్ష సమయానికి నాలుగు నుంచి ఆరు నెలల వెనుక కాలానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆయా విషయాలపై స్థూల అవగాహన ఉండాలి. పరీక్ష తేదీకి ఆరు నెలల ముందు నుంచి కరెంట్ అఫైర్స్పై దృష్టి పెట్టినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు.
* జనరల్ స్టడీస్లోని కొన్ని విభాగాలు కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉంటాయి ఆ విభాగాల్లోని ప్రశ్నలకు జవాబులను కరెంట్ అఫైర్స్తో అనుసంధానించి చదవాలి. ఇండియన్ ఎకానమీలో భారత ఆర్దిక సర్వే 2021-22, బడ్జెట్ 2022-23 లోని వివిధ గణాంకాలు, భావనలను ఆర్థిక వ్యవస్థ సిలబస్లోని వివిధ అంశాలతో ముడి పెట్టుకోవాలి. అదే విధంగా భారత రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన సవరణలు సుప్రీంకోర్టు తీర్పులు, కొత్తగా చేర్చిన అధికరణాలు, షెడ్యూళ్లకు ప్రాధాన్యం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలోని అనేక విషయాలపై అభ్యర్థులు కరెంట్ అఫైర్స్తో అనుసంధానం చేసుకుని అప్డేట్ నాలెడ్జి పెంచుకోవాలి.
* గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షలో, మెయిన్స్లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించి ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రిలిమినరీ, మెయిన్స్ ప్రశ్నల రూపాన్ని అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ పట్టు సాధించవచ్చు.
* జనరల్ స్టడీస్ పేపర్లోని కొన్ని అంశాలు మిగతా పేపర్స్లో విస్తృత మార్కుల కింద ఇచ్చారు. అందుకని గ్రూప్-2 రాస్తున్న అభ్యర్థులు జనరల్ స్టడీస్లో అంతర్భాగంగా కాకుండా వాటిని ప్రత్యేకంగా చదివితే ప్రయోజనం ఎక్కువ.
కురుక్షేత్ర, యోజన, న్యూ ఇండియా సమాచారం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ మొదలైన వనరుల పఠనం ద్వారా జనరల్ స్టడీస్ లోని వివిధ అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. మార్కులను కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వ వనరులన్నీ సమర్థంగా వినియోగించుకునే మెలకువను జనరల్ స్టడీస్లో కూడా వినియోగిస్తే ఉద్యోగాలు సులభంగా పొందే అవకాశం ఉంటుంది.
*ఏది జీకే? ఏది కరెంట్ అఫైర్స్?*
కొన్ని పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో అంతర్భాగంగా జనరల్ నాలెడ్జ్ (జీకే) కూడా ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు, సంఘటనలు, ప్రపంచంలో గుర్తింపు పొందిన ప్రత్యేక ప్రదేశాలు, వస్తువులు, జీవులు మొదలైనవి జీకే కింద పరిగణనలోకి తీసుకుంటారు. మనోరమ ఇయర్ బుక్ లాంటి పుస్తకాలు చదవడం వల్ల జీకేలోని విషయాలపై అవగాహన వస్తుంది.
‘భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించారు?’ అనేది జనరల్ నాలెడ్జ్.
‘ఈ సంవత్సరం భారతరత్న అవార్డును ఎవరికి ఇచ్చారు?’ అనేది కరెంట్ అఫైర్స్.
‘ప్రపంచంలోని 7 వింతలూ’.. జనరల్ నాలెడ్జ్.
‘ఇటీవల పర్యావరణ కాలుష్యం కారణంగా ఏ ప్రపంచ వింత ఉనికిని కోల్పోతోంది?’ – ఇది వర్తమానాంశం.
*వివిధ విషయాలను చదివేటప్పుడు మౌలిక అంశాలను జనరల్ నాలెడ్జ్ కింద చదివి, తాజా పరిణామాలను కరెంట్ అఫైర్స్ కింద చదువుతూ అనుసంధానం చేసుకోవచ్చు.