andhra-telangana-mbbs-seats-2022-23

andhra-telangana-mbbs-seats-2022-23

MBBS & BDS Seats : ఏపీ, తెలంగాణ‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ సీట్లు ఇవే.. ఈసారి మాత్రం..

NEET UG–2022 ఫలితాలను సెప్టెంబ‌ర్ 7వ తేదీన విడుద‌లైన విష‌యం తెల్సిందే. ఈ ఫలితాలను వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. త్వ‌ర‌లోనే కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనుంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎంబీబీఎస్‌. బీడీఎస్ సీట్ల వివ‌రాలు మీకోసం..

ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లు మాత్రం..

ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ ఇలా కోటాలు కలిపి 5,060 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 సీట్లు (ఈడబ్ల్యూఎస్‌ అదనపు సీట్లు కలిపి) ఉన్నాయి.

అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ (కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి. అత్యల్పంగా ఒంగోలు రిమ్స్‌లో 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో ఆల్‌ ఇండియా కోటా 325 సీట్లు, రాష్ట్ర కోటాలో 1,890 సీట్లు భర్తీ చేస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. కాగా 2 ప్రభుత్వ డెంటల్‌ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో 1400కు పైగా బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి.

తెలంగాణ‌లో సీట్ల వివ‌రాలు ఇలా.. 

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,965 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,600 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల మూడు ప్రైవేటు కాలేజీలకు సంబంధించి అడ్మిషన్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిల్లోని 450 ఎంబీబీఎస్‌ సీట్లను తీసేస్తే 3,150 సీట్లు ఉంటాయి. అయితే ఎంఎన్‌ఆర్‌ కాలేజీకి దాదాపు అనుమతి వచ్చినట్లేనని కాళోజీ వర్గాలు అంటున్నాయి. కాబట్టి అవి 150 కలిపితే 3,300 సీట్లు అవుతాయి.

మరోవైపు ఈసారి ప్రభుత్వం తెలంగాణ‌లో 8 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో జగిత్యాల, సంగారెడ్డి, నాగర్‌ కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి మెడికల్‌ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. దీంతో వాటిల్లో 900 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా మొత్తం 16 ప్రభుత్వ కళాశాలల్లో 2,665 సీట్లు ఉండనున్నాయి. ఇక రామగుండం, మంచిర్యాల కాలేజీలకు కూడా అనుమతులు వస్తే వాటి ద్వారా మరో 300 సీట్లు పెరుగుతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి.