నాన్ క్రీమీలేయర్ ఆదాయ పరిమితి రూ.8 లక్షలకు పెంపు
ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు అర్హత ఆదాయ పరిమితిని పెంచింది.
ప్రస్తుతం ఏడాదికి రూ.6 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగా మార్చింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఇక నుంచి రూ.8 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న ఓబీసీలు మాత్రమే క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారు.
అంతకన్నా తక్కువ ఆదాయమున్న వారంతా విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లకు అర్హత పొందుతారు.
సర్టిఫికెట్ల జారీలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆదేశించింది.
ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా
విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ అమలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం*
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం రిజర్వేషన్లలో గతంలో కాపులకు 5 శాతం, ఇతరులకు 5 శాతం కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
దీంతో విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను వర్తింపజేస్తూ బీసీ సంక్షేమశాఖ 2019 జులై 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల స్ఫూర్తినే ఉద్యోగ నియామకాలకూ వర్తింపజేస్తూ ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలుకు ఇచ్చిన మార్గదర్శకాలే.. అంటే ఏ రకమైన రిజర్వేషన్ల కోటాలోకి రాని, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించారు.
★ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కేటగిరీలో రాకుండా ఏడాది రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.
★ అయిదెకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయం భూమి ఉండకూడదు.
★ వెయ్యి చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ నివాస ఫ్లాటు ఉండకూడదు.
★పురపాలక, నగరపాలక సంస్థల్లో 100 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ నివాస స్థలం ఉండకూడదు.
★ నగర, పురపాలక పరిధిలో లేని ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలం ఉంటే అర్హులు కారు.
★ రిజర్వేషన్ పొందడం కోసం తహసీల్దారు జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
*విద్యా సంస్థల్లో..*
గతంలో బీసీ సంక్షేమ శాఖ 2019-20లో విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా ప్రభుత్వం ఈ సంవత్సరంతోపాటు రాబోయే విద్యా సంవత్సరానికీ దీన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.