జిల్లాల్లో కేటగిరీల వారీగా త్వరలో అర్హుల జాబితా
ఒకేసారి సుమారు లక్ష మంది ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు
వేతనం దాదాపు రెట్టింపు
2022 రివైజ్డ్ పే స్కేలు ప్రకారమే వేతనాల నిర్ధారణ
గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీ, వార్డు అడ్మిన్ సెక్రటరీ పే స్కేలు రూ. 23,120 – 74,770
గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం హెచ్ఆర్ఏ శ్లాబులో ఉన్న వారికి రూ.29,590 వేతనం
మిగిలిన 17 రకాల ఉద్యోగుల పే స్కేలు రూ.22,460–72,810
వీరికి గ్రామీణ ప్రాంతాల్లో వేతనం రూ.28,753
పట్టణాల్లోని వారికి హెచ్ఆర్ఏ శ్లాబు మేరకు పెరుగుదల
2022 పేస్కేళ్ల వర్తింపుతో రూ.10 వేల వేతనం పెరుగుదల
పెరిగిన వేతనాలు జూలై 1 నుంచే అమలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయడంతో పాటు వారికి 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్(11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు లక్ష మంది ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారుకు అర్హత పొందుతారని అధికారులు తెలిపారు. తద్వారా వారి జీతాలు దాదాపు రెట్టింపు కానున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి 8 శాతం హెచ్ఆర్ఏ స్లాబ్ ప్రకారం ఈ వేతనాలు అందుతాయి. పట్టణ ప్రాంతాలలో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ స్లాబు మేరకు ఆయా చోట్ల పని చేసే ఉద్యోగులకు మరికొంత అధిక వేతనం దక్కుతుంది. పెరిగిన వేతనాలు జూలై 1 నుంచి (అంటే ఆగస్టు 1న ఉద్యోగుల చేతికి అందే జీతం) అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం రూ.15 వేలు వేతనం పొందుతున్న విషయం విదితమే.
2022 పే– రివిజన్కే సీఎం జగన్ ఆమోదం
2018లో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్ లేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న 2015 పే రివిజన్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది జనవరి విడుదలైన పీఆర్సీ జీవోలలోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే – స్కేలును నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఉదహరించారు.
ఆ ప్రకారం.. గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.18,691 ఉంటుంది. అయితే ఈ పాత పే – స్కేళ్లకు బదులుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్) ప్రకారం లెక్క కట్టి కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ.10 వేలు పెరిగింది.
కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అర్హుల జాబితాలు
ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు విడుదల చేసిన చేసిన నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో 26 జిల్లాల్లో వేర్వేరుగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జారీ చేసిన జీవో నెంబరు 5 జతచేసి.. కమిషనర్ షాన్మోహన్ వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడింగ్స్ జారీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.